??????

30 డిసెం, 2012

వద్దు నీకు ఆత్మశాంతి..



వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆత్మఘోషే బడభాగ్ని జ్వాలై 
నరరూప రాక్షసులను దహించేసేదాకా  
వద్దు నీకు ఆత్మశాంతి..
నీ ఆక్రోశమే ఆకాశ ఉరుమై..
నెత్తురు తాగే నక్కలను కాల్చేసేదాకా 
వద్దు నీకు ఆత్మశాంతి 
నీ కడగండ్లే మృగాల
మరణసెయ్యకి రంపపుముళ్ళై కొసేసేదాకా  
నీ కన్నిటిలో భారతావని 
నెత్తుటి మరకలు కడగబడ్డాక.. 
నీ ఆవేదనతో భారత ప్రజల 
వేదనాశృవలన్నీ ఆవిరయ్యాక.
అప్పుడు..అప్పుడే.. 
'నిర్భయం'గా నిదురపో..
మానవత్వం పరిమళించే
మనిషి గుండెలో    
అంతవరకూ లేదు రాదు 
వద్దు నీకు ఆత్మశాంతి .
రగలాలి..రగలాలి..
ఈ కార్చిచ్చు ..

28 డిసెం, 2012

దొరికాడు కన్నయ్య...

నేను ఎన్నళ్ళనించో ఎదురు చూసి,కావాలనుకున్న,నా కిట్టయ్య ప్రతిమ తెచ్చేసుకున్నానోచ్ .
ఆనందం మీతో పంచుకుందామని ఇలా వచ్చా..
నాకు దేవుడి మందిరాలు,విగ్రహాలు ఇలాంటివన్నీ చలువరాతివి ఇష్టం
ప్రశాంతంగా ఉంటూనే ,ధవళ వర్ణంలో మెరిసిపోతూ ఉండే దేవుళ్ళను ఎంత సేపు చూసినా తనివి తీరదు.
తులసీ ()ళం చదివిన వారికి తెలుసు కదా ? చలువరాతి వస్తువుల మీద నా మమకారం.
తులసి కోట కోసం పడినంత కష్టం పడకుండానే ,చలువరాతి మందిరం దొరికింది శిల్పారామంలో..ఇంటికి తెచ్చుకొని చక్కగా నా దేవుళ్ళను దేవతలను మందిరంలో కొలువు తీర్చాను.



కానీ నా కన్నయ్య ప్రతిమ మందిరంలో చూడ చక్కగా కొంచెం పెద్దది లేకుండా,మందిరం బోసిపోయిందే అని బాధ .
చలువరాతి కన్నయ కోసం చాలా చోట్ల వెతికాను.శ్రీవారి రాజస్థాన్ స్నేహితుడు కూడా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది.
అన్ని చోట్ల పెద్దవాడిగా,రాధను పక్కన ఉంచుకొని   చెట్టు కిందో మురళి వాయిస్తూ ఉంటాడే కానీ ఒంటరిగా చిక్కడే మాయలోడు??
మొన్న ,ధనుర్మాస ప్రారంభం రోజు  నా కోరిక మేరకు బిర్లామందిర్ తీసుకెళ్లారు పతిదేవులు
(ఎందుకన్నానంటే,మరి రోజు ధనుర్మాస ప్రారంభం ,అందులోను శనివారం ..అందుకే నేను అడిగిన వెంటనే,
"దేవీ .. దినము మేము రాజాలము.మాకు కాలునొప్పి మరి" అని తప్పించుకోబోయిన వారిని,చెలిగి కుదరక అలిగి మొత్తమ్మీద ఒప్పించాను.ఇంత సాహసం చేయబూనారు కాబట్టి రోజుకి అలా 'పతిదేవు'లైనారు.)  
కానీ మా అదృష్టం కొలది,కాదు కాదు నాకే ఎంత క్యూ ఉన్నా చక్కగా అన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి ,శ్రీవారి అదృష్ట బలానదర్శనం సుళువుగానే అయిపోయింది.
భిర్లా మందిర్ దగ్గర ఒక షాపు ఉంటుంది కదా..అక్కడ బోలెడన్నిచలువరాతి,పంచలోహ,అష్టధాతు దేవుళ్ల విగ్రహాలే కాక,ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు,మరెన్నో పాటల సిడీలు  ఉంటాయి కదా!
అక్కడ నేను అనుకొనేంత పరిమాణంలో రాముడి విత్ ఫ్యామిలీ విగ్రహం ఉంది కానీ కన్నయ్యది లేదు.నేను పదే పదే షాపువాళ్ళను అడిగి విసిగించేసరికి, శ్రీనగర్లో చాలా మార్బల్ ఎంపోరియం లు ఉంటాయి మేడం అక్కడ ప్రయత్నించండన్నారు షాపు యజమాని.
ఇక అక్కడి నించి ఒకసారి లేపాక్షి కి వెళ్ళి,అక్కడ కూడా లేవని తీర్మానించుకున్నాక
శ్రీనగర్  వెళ్ళాం.
అక్కడ వరుసగా చాలా ఎంపోరియంలు ఉన్నాయి. ఒక పెద్ద ఎంపోరియం కూడా ఉంది .అక్కడ కూడా లేడు కన్నయ్య..:(
సరే చివరిగా ఒక చిన్న ఎంపోరియంలో అడిగితే అక్కడ దొరికాడు నా కన్నయ్య.
 పూజించే ప్రతిమ ఎక్కువ ఎత్తు,బరువు  ఉండకూడదని మా అత్తగారు చెప్పారు .నా కన్నయ్య ఇంచక్కా బరువు కూడా లేకుండా,చిన్నగా,పక్కన రాధను కూడా ఉంచుకోకుండా నా కోసమే చూస్తున్నాడు .
ఇంకేముంది గంతులేసుకుంటూ నాతో పాటూ బండి ఎక్కించుకొని తీసుకొచ్చేసా కన్నయ్యని ,

అత్తగారు ఫోను చేస్తే,
"ఇలాగ,కన్నయ్య దొరికాడు అని చెప్పాను".
"ధనుర్మాసం కదా మనింటికి కన్నయ్య వచ్చాడులే "అన్నారు మా అత్తగారు నా సంబరాన్ని రెట్టింపు చేస్తూ..


చక్కగా స్నానం చేయించి, బొట్టూ కాటుక దిద్ది  ,బట్టలు తొడిగి,పూసలతో అలంకరించి,తలపాగా చుట్టి,నెమలి పింఛం పెట్టి,
చేతికొక మురళి ఇచ్చి ఊదుకోమని
"అనుకోకుండా వచ్చావు పెట్టడానికి ఎమీ లేవు.
ఏమనుకోకే ముక్కోటేకాదశి రోజు పాయసం చేస్తాగా రోజుకి పటికబెల్లంతో సరిపుచ్చుకో"మని చెప్పిమందిరంలోకి పంపించా,బుద్ధిగా వెళ్ళి ఎలా మందిరంలో నించున్నడో చూడండి అల్లరివాడు.


చక్కగా సంధ్య దీపమెట్టి ."ముద్దుగారే యశోద" పాట పాడుతుంటే  

వేణువూదుతూ,నవ్వు వెలుగుతున్న నా కన్నయ్య ప్రశాంత వదనాన్ని చూస్తూ 
దణ్ణమెట్టుకున్నాను.

కన్నయ్యను నాకు దొరకబుచ్చిన శ్రీవారికి బ్లాగ్ముఖంగా బోలెడు థాంక్సులు .:)

నా కన్నయ్య మీకూ నచ్చాడా మరీ..?? 

26 డిసెం, 2012

గజరాజు


వరుసగా నాలుగు రోజులు సెలవలు వచ్చేసరికి ఎంచేయాలా అని ఆలోచించీ,సరే సినిమాకైతే ముందు వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం నేను శ్రీవారు.
"గజరాజు" సినిమా ట్రైలర్ చూసి ఫోటోగ్రఫి అదిరింది అనుకుంటూ ఆదివారం సెకండ్ షో కి టిక్కెట్లు తీసుకుందామని హాలుకి వెళ్ళాం.
9:45 షోకి ఎనిమిదిన్నరకి కానీ ఇవ్వరట టిక్కెట్లు.9:30 వచ్చినా ఫర్వాలేదు,ఖాళీగానే ఉంది అన్నారు అక్కడివాళ్ళు.
అసలే మరీ రియలిస్టిక్ గా,విషాదాంతాలు ఎక్కువగా ఉండే డబ్బింగ్ సినీమాలంటే నాకు భయం.
హాలు ఖాళీగానే ఉంటుందనేసరికి,ఒకప్పుడు ఇలాగే ట్రైలర్ చూసి ఫోటోగ్రఫి బాగుందని,మోసపోయి చూసిన డబ్బింగ్ సినిమా  "నిరంతరం నీ ఊహలే" సినిమా గుర్తొచ్చి కొంచెం జంకాం.సరే ఇదేదో బోరింగ్ సినిమాలాగుంది అని ఆ రోజుకి లైట్ తీసుకున్నాం.

మంగళవారంతో సెలవలు అయిపోయాయి.రేపు మళ్ళీ ఆఫీసుకి వెళ్ళలా అని నేను దిగులుపడిపోతుంటే, సరే అయితే మళ్ళీ సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని,ఏ సినిమాకి వెళ్ళలో తెలియక మళ్ళీ గజరాజు సినిమాకి తీసుకొచ్చారు మా సారు.
ఆదివారంతో పోలిస్తే ఫర్వాలేదు జనాలు బాగనే ఉన్నారు హాలులో.సరేలే ఎదో బాగుందని టాక్ వచ్చుంటుందని లోపలికి వెళ్ళాం.అయిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యేచ్ ఉన్నా, ఇంతమంది రావడంతో సినిమా మీద ఆశలు పెరిగాయి.
లోపకెళ్ళి కూర్చున్నాం.
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా
దర్శకుడు ప్రభు సోల్మన్ ఎన్నుకున్న నేపధ్యం,
కేమెరామేన్ పనితనం,
ఇమ్మన్ సంగీతం,
కధలో అంతర్లీనంగా ఇమిడిపోయిన హాస్యం .
టూకీగా కధేమిటంటే,
అడవి ఏనుగులు దాడి చేస్తే వాటిని మళ్ళీ అడవిలోనికి తరిమేసే శిక్షణ పొందిన ఏనుగులను "గుంకీ" ఏనుగు అంటారు.
అనుకోని పరిస్థితుల్లో 'మాణిఖ్యం' అనే  ఒక  ఉత్సవ ఏనుగును గుంకీ ఏనుగుగా  దేవగిరి మన్యం ప్రజలను 'కపాలి' అనే అడవి ఏనుగునించి కాపడడానికి  తీసుకొస్తాడు కధానాయకుడు.అక్కడ కధానాయికను చూసి ప్రేమలో పడి,ఉత్సవ ఏనుగును గుంకీ ఏనుగుగా అక్కడివారిని నమ్మిస్తాడు.


అక్కడి వారు రెండువందల ఏళ్ళ చరిత్ర కలిగి కట్టుబాట్లంటే ప్రాణం ఇస్తారు.అలాగే తమ కట్టుబాట్లను ఎదురిస్తే ప్రాణాలు తీస్తారు కూడా.
అతని ప్రేమ కధ ఎమవుతుంది.కట్టుబాట్లను ఎదిరించి ప్రేమను పొందగలిగాడా?
మాణిఖ్యం కపాలిని ఎదురించగలిగిందా అనేది కధ.
మాణిఖ్యం ,కధానాయకుడి మధ్య గల అనుబంధం ,మాణిఖ్యానికి కధనాయికుడి మీద గల అపారమైన ప్రేమ కంటతడి పెట్టిస్తుంది.


ప్రేమలో పడి కధనాయకుడు చేసిన తప్పులకి చెల్లించిన మూల్యం కదిలిస్తుంది.

ట్రైలర్లో చూపించినట్లుగానే అందమైన ప్రకృతి దృశ్యాలు కేమెరామేన్ పనితనంతో కనువిందు చేసాయి.ఎటువంటి మేకప్ లేకుండా సాధారణంగా చూపించబడినా నాయికను కేమెరాఆంగిల్స్ తో అద్భుతంగా చూపించారు.
పాటలలో అయితే సంగీతంతో పాటూ కేమెరా కదిలిన విధానం నవ్యంగా ఉంది.



సంగీతం విషయానికొస్తే  కధలో ఒదిపోయింది.ఎమోషన్స్ పండించడంలోనే కాక మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి పాటలు.పాటల సాహిత్యం కూడా చాలా బాగుంది.
సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు పాటలు
1.చెప్పేసాలే నా ప్రేమని..



2.అయ్యయ్యయ్యో ఆనందమే..



చిన్న చిన్న విమర్శలు ఉన్నా,మొత్తం మీద సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామనే భావన తప్పక కలుగుతుంది.అదే సమయంలో మనసు వేదనతో నిండిపోతుంది కూడా.ఏనుగు నటన అద్భుతం .

చూసిన తర్వాత వెంటాడే సినిమా ఇది.


24 డిసెం, 2012

అలా జరిగిందన్నమాట.


అనగనగనగా..
అప్పుడు నాకు అయిదేళ్ళన్నమాట..
నాకు బడికెళ్ళే ఈడొచ్చిందని అక్షరాభ్యాసం చేయించి, స్కులులో ఎల్కేజి లో జాయిన్ చేసారు.
మొదటి రోజు కొత్త బ్యాగు..కొత్త పుస్తకాలు,కొత్త షూలు ఇవన్నిటితో పాటూ అందరికీ పంచడానికి చాక్లెట్లు ..బిస్కెట్లు పాకెట్లు ఇలా అమ్మ బొలేడు ఇచ్చేసరికి నాన్నారి సైకిలెక్కి గంతులేసుకుంటూ స్కూలుకెళ్ళాను.

 

  అందరికీ చాక్లెట్లు,బిస్క్లెట్లు పంచుతాం కదా.అలా పంచేయగా ఇంకా పాకెట్లో బొలేడు ఉన్నాయి.
 "అబ్బ ఇవన్నీ నాకే ఇంచక్కా తినొచ్చు ఎన్ని ఉన్నయో" అని నేను తెగ సంబరపడిపోతుంటే
 "ఏయ్ అవన్నీ నాకిచ్చేయ్."
  అని ఒక గొంతు వినబడింది.ఎవరా అని తల పక్కకి తిప్పి చుస్తే,
  పెద్ద పెద్ద కళ్ళు ..బాబ్ హైర్ కట్తో ఒక అమ్మాయి చంద్రముఖిలాగా ఆ కళ్ళు ఇంకా పెద్దవి చేసి నన్నే చూస్తూ  అడుగుతుంది.
  దెబ్బకి నాకు భయం వేసి కొన్ని తీసి ఇచ్చాను. ఆ అమ్మాయి పాకెట్ మొత్తం లాగెసుకుంది.నేను కిక్కురుమనలేదు.
  ఆ అమ్మాయి రెండవ తరగతి.అంటే నాకంటే మూడేళ్ళు పెద్దదన్నమాట.ఆ అలుసుతోనో..లేకపోతె నేను మరీ అంజలి పాపలా కనిపించానో ఎమో??
 ఇక మొదలయ్యింది నామీద ఆవిడగారి గూండాగిరి.
 రోజు అమ్మ ఇచ్చే చాక్లెట్లు మొదలగు చిరుతిండి అంతా లాగేసుకొనేది.పొరపాటున ఇవ్వనన్నా,దాచుకున్నా ఒక    పొద చాటుకి తీసుకెళ్ళి బాగా కొట్టేది.రోజూ ఇదే తంతు.
 మనం అమ్మ దగ్గరో,టీచర్ దగ్గరో నోరు మెదపొచ్చు కదా..
 యబ్బే..
 చక్కగా రోజు ఆ అమ్మాయికి నా చిరుతిండంతా ఇచ్చేసి,ఇంచక్కగా పొదచాటుకెళ్ళి కొట్టించుకొని,ఆ పొద చాటునే బేర్ బేర్ మని ఎడ్చేసి, లోపల మొగుడు తన్నినా పదిమందిముందూ నవ్వుతూ కనిపించే మహాపతివ్రత రేంజులో పొద బయటకు నవ్వుతూ వచ్చేదాన్ని
.ఒక్క చిరుతిండే కాదు పెన్సిళ్ళు ..బలపాలు అన్నీ లాగేసుకొనేది.
నేను రోజూ స్కూలుకెళ్ళనని ఏడ్చేదాన్ని.



 ఇలా క్షణమొక గండంగా రోజులు గడుస్తుండగా..
  ఒక రోజు ఆ అమ్మయికి పిచ్చి బాగా ప్రకోపించింది .
నేను ఆరోజుకి నా చిరుతిండంతా ఇచ్చేసినా ,
 "నా దగ్గర ఇంకేమీ లేవే నా సాడిష్టు తల్లో.నన్నొగ్గేయవే నా చంద్రముఖో"
 అన్నా వినకుండా నన్ను పొద చాటుకు లాక్కేళ్ళింది.
 "ఏమే నీకు నేను ఆషామాషిగా కనబడుతున్ననా" అంది.
 "నేనేం చేసాను" అన్నాను భయంగా
 "నువ్వు కాదే ఆ టీచర్ది హోం వర్క్ చేయలేదని నన్ను తిడుతుందా"
అని నన్ను వంగోబెట్టి ఒక్క వీపు విమానం మోత మోగించింది.




 నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
 "ఎన్నాళ్ళు..ఇంకెనాళ్ళు నీ దురాగతాలు??ఈ అన్యాయాన్ని నేను సహింపజాల" అని..
 టీచర్ దగ్గరకెళ్ళి
 "ఈ అమ్మాయి నన్ను కొడుతుంది " అని చెప్పాను.
 "తప్పమ్మా ఇద్దరు కలిసుండాలి.ఇలా ఒకరిమీద ఒకరు చెప్పుకోకూడదు" అని చెప్పి,
ఒకరి చేత ఒకరికి కరచాలనాలు చేయించి,మా మద్య స్నేహాన్ని చిగురింపజేసి ఇద్దరినీ క్లాసులకి పంపించేసింది. నేను బిక్కు బిక్కుమంటూ క్లాసుకేసి నడుస్తున్నాను.
టీచర్కి చెప్పాను కదా మన చంద్రముఖి సాడిజం ఉగ్ర రూపం దాల్చింది.
 పొద చాటుకి తీసుకెళ్ళి బ్లేడుతో పర పర మని చేతి మీద కోసేసి,నా పీక పట్టుకుంది.



అంతే నేను అరిచిన అరుపు మొత్తం స్కూలు అంతా అక్కడ ప్రత్యక్షం అయ్యింది.
 సాడిస్టు చంద్రముఖి అలా ప్రత్యక్షంగా దొరికిపోయింది.
 తర్వత ఆ అమ్మాయిని స్కూలు వాళ్ళు పంపించేసారు.
 నెల రోజుల టార్చర్కి అల తెర పడింది.
 కాని నేను మాత్రం ఆ స్కూలుకి చచ్చినా వెళ్ళనని కూర్చున్నా.
ఇంకేంచేస్తారు అమ్మావాళ్ళు.ఈసారి ఒక్కదాన్నే ఎందుకని నాతో పాటూ చెల్లినీ కలిపి ఒకే స్కూలులో వేసేసారు.


 తర్వాత ఒక సంవత్సరకాలం
" నన్ను కొట్టొద్దు. గిల్లొద్దు. రక్కొద్దు" అని కలవరిస్తునే ఉన్నా.
ఇప్పటికీ ఆ చంద్రముఖి కళ్ళు నేను మర్చిపోలేను.
 ఇందువలనచేత..
 నేను చెప్పొచ్చేదేమిటంటే మీ పిల్లలు చదువుతున్న స్కూలులో ఇలాంటి పనులు చేసే పిల్లలు కూడా ఉండొచ్చు.మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండోయ్.పిల్లలు అన్నీ చెప్పలేరు.మనమే అన్నీ ప్రశ్నలు వేసి తెలుసుకోవాలి.
మీకు తెలిసిన విషయమే ఒకసారి గుర్తు చేస్తున్నా ..
 పిల్లలు జర బధ్రం.

15 డిసెం, 2012

బాపూ గారికి జన్మదిన శుభాకాంక్షలు..



సిత్రాల బాపూ..
సినీమాల బాపూ..
నవ్వుల బాపూ..
తెలుగును వెలిగించిన
'రమణీ'య బాపూ..

గారికి జన్మదిన శుభాకాంక్షలు..:))

14 డిసెం, 2012

వేణుగాన సమ్మోహితనై....



జారు పమిట చూసి వెన్నెల రేడు నవ్వుతున్నా.. 
విచ్చుకున్న సన్నజాజులెక్కడికని ఆరా తీసినా..
చిరుచెమట కరిగిన కస్తూరి గుభాళించి గుట్టు రట్టవుతున్నా ..
గుదిగుచ్చిన మాలికనుండి ఒక్కో ముత్యం జారిపడుతున్నా..    
పిల్లతిమ్మెరలు చిగురుటధరాలను వణికిస్తున్నా   ..
భువి సింగరించుకున్న పున్నాగలు లత్తుకపదములను అడ్డుకున్నా  ..
నీకై చేబూనిన కడువలోని నవనీతం నా మానసమల్లే పొంగుతున్నా..
నీ వేణు గాన పిలుపులు విని ,
పరుగు పరుగున వచ్చాను కన్నా.. 
నీ నవ్వుల వెన్నెల వానలో తడువనిస్తావనీ ..
నీ అధర తేనియల మధురిమలో తేలియాడనిస్తావనీ. .
నీ ముద్దు మోమును నా కంటిపాప అద్దమున వీక్షిస్తావనీ..
నీ ముకుంద  ముగ్ధ చరణాల అరుణిమ చెంతింత చోటిస్తావనీ..    
ఈ క్షణాన మాత్రమే కాదు సుమా  !
కడవరకూ ....
ఈ 'రాధా'కుసుమ పరిమళం పూర్తిగా ఆవిరయ్యేంతవరకూ.. 

చిత్రాలు:
ఇది నేను ఇంటర్ చదువుతుండగా వేసుకున్న చిత్రం.
అప్పుడప్పుడే వాటర్ పెయింట్స్ దాటి ఫాబ్రిక్ పెయింట్స్ మొదలు పెట్టాను..
ఎందుకో చిత్రకళంటే ప్రత్యేకమైన అభిమానం.
ఎక్కడా నేర్చుకొనే అవకాశం రాలేదు..ఇప్పుడు నేర్చుకుందామంటే సమయం చిక్కట్లేదు.
పెద్దగా పరిపక్వత లేకపోయినా ఇలా మీతో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నాను..

8 డిసెం, 2012

మా గొప్ప మారాజులు




సూరి :
"ఒరేయ్ సుబ్బిగా... ఆ పుగ అలా గుప్పుగుప్పుమని సేగోడీలు..జంతికల్లెక్కన గాల్లోకి  ఒదిలితే నీగ్గాదు నీపక్కనున్న నాకోత్తాది కేన్సరు "
సుబ్బు :
"ఓసోస్..మాకు తెల్దులే కేన్సరొత్తే ఏటంటా? కలిసే సద్దారి "
సూరి :
"గొప్పొడివిలే.. నీతో నేను సావలేనుగాని ..ఏటి రా ఆకాశంలోకి సూత్తా తెగ ఆలోసిత్తున్నావ్ "
సుబ్బు :
"అడికాదుగానోరేయ్ !కేన్సరంటే గేపకమోచ్చింది మన జానకమ్మ పోయింది కేన్సరుతోనే గాందా"
సూరి:
"అవునురా .ఆయెమ్మ ఇంక లేదంటే గుండెసెరువైపోతుంది..మా గొప్ప మనసు ఆయెమ్మది .."
సుబ్బు : 
"జానకమ్మ పోయాక  జమిందారీగోరు   ఎటేల్లిపోనాడో ?"
సూరి :
"నిజమేరా సుబ్బిగా ఎటేల్లినాడో ??ఎప్పుడైతే ఆ మాతల్లి ని ఇడిసిపెట్టేసినాడో  ఆనాడే ఆయన వైబోగామంతా పోయిందిరా..మడిసి బొత్తిగా కళతెప్పేసిన్నడు "
సుబ్బు :
"అందుకేరా సూరిగా  సెప్పుడు మాటలనికూడదనేది ఆ బంగారు తల్లి నిజంగా లచ్చిమేరా ."
సూరి :
"అవునురా .లేకపోతే పెద్ద జమిన్దారిగారి రెండో భార్య ఆస్తి మీద కన్నేసి కట్టుబట్టలతో ఎల్లగోట్టినా ..మాతల్లి ఒక్క మాట కూడా అడక్కుండా జమిన్దారిగారి ఏనాకాలే ఎల్లిపోనాది "
సుబ్బు :
"ఆ తల్లి ఎమన్నా తక్కువింటి నుంచి ఒచ్చిందేంట్ర్రా  .ఆల్లది ఇంతకంటే పెద్ద జమీను .."
సూరి :
"ఎంత సంపదలోంచోచ్చినా ఆ గర్వమే ఉండేదికాదు .అడిగినోల్లకి లేదనకుండా ఇచ్చేది .మాతల్లికి సేతికెముక ఉండేది కాదు "
సుబ్బు :
"కోటలోంచి ఎల్లిపోనాక గోదారొడ్డున సిన్న పూరిగుడిసెలో సర్డుకుపోనాది "
సూరి :
" మంచితనానికి ఇంకా రోజులేల్లిపోలేదురా.మన అంజయ్యగారుకూడా జమిందారిగోరినంటిపెట్టుకొనే  ఉండేటోడు .. ఆరి ఆస్తులు పోయినా ..ఆరు జీతమియ్యకపోయినా ఆరికోసం కోర్టుల సుట్టూ  తెగ తిరిగినారులే. "
సుబ్బు :
"ఒసోస్ ..ఆమాటకొత్తె బుల్లి జమిన్దారుగారు ఏటి ??..ఆరు కూడా ఎంత గ్రేటో.ఆస్తి మీద కన్నేసి జమిన్దారిగారి రెండో భార్య ఈల్లని ఎల్లగోట్టినా ..కోర్టుల సుట్టూ  తిప్పినా ..పెద్దోల్లందరూ కాలం సేసినాక జమీనంతా  అన్నగారికి ఒప్పజేప్పేసినారు."
సూరి :
"అప్పుడినించే కదరా ఊరికి మంచి రోజులోచ్చినియ్యి .ఆయన జమిందారి పద్దతి గురిన్సి..ఆ ఏటి?? సుట్టుపక్కల పదూల్లకే కాదు ముఖ్యమంత్రి దాకా ఎల్లింది కదరా .ఎంత బాగుసేసాడు రా ఊరుని..ఊరు తీరె మార్సేసాడు..ఇయ్యాల ఊర్లో అందరూ కలో గంజో తగుతున్నారంటే..ఆయన సలవ కాదేటి రా     "
సుబ్బు :
"అంతే కదరా మరీ..
ఏంలాభం  మారాజులకి కట్టాలు తప్పాయేంట్రా..
సామెత సెప్పినట్టు ...అనుమానం మా సెడ్డదిరా ..
గోదారొడ్డున ఆడెవడో అమ్మగోరిని రోజు సుడ్డమేంటి ?
అమ్మగారు ఇలా ఉంటారు అలా ఉంటారని.. నాకనుభవమయ్యిందని ..
ఆడు ఈరిగాడిదగ్గర  వాగాడమేంటి ??
ఊరంతా అది పోక్కడమేంటి ??
అదొచ్చి ఎవడో   జమిన్దారిగారికి సెప్పడమేంటి ??
ఏ కళనున్నడో జమిందారిగోరు.ఆడి మాటలిని జమిందారి పరువు పోతుందని ఇద్దరు పసిబిడ్డ్లలతో  సహా జానకమ్మని  పుట్టింట్లో వుదిలేయడమేంటి ..
సిత్రం కాకపొతేను. "
సూరి :
"సిత్రం కాదురా.. పెద్దోల్లందరూ అంటరే ఇది అని..అదే మరి "
సుబ్బు :
"ఏ  మాట కామాటేరా పరువుకోసం అమ్మగోరిని ఇడిసిపెట్టారు కాని.పేమ లేక కాదురా ..ఆ తర్వాత మడిసి మడిసిలో లేడు .అసలు తర్వాత ఊరు ముకమే సుల్లేదు మారాజు "
సూరి :
"తర్వాత ఎంత ఇదైపొతే ఏంట్రా??తప్పు తెలుసుకొని ఎల్లేసరికి మాయదారి కాన్సరు  ఆయెమ్మ పేనం తీసేసింది "
సుబ్బు  :
"పాపం ఇంకేటి సెత్తారు  .నిండా పదెనేల్లు లేని ఆ పిల్లలకి ఊరునప్పజెప్పేసినాడు.పోని జమీను బుల్లిజమిందారుగోరికి ఒప్పజేప్పుదామంటే ఆయనేమో అన్నగారి ఆస్తి ముట్టుకోనని కూసున్నాడు ."
సూరి :
"అవునులే ఇంకేటి సెత్తారు ..ఆ పసిబిడ్డలకే  అన్ని ఒప్పజేప్పేసి ఎటెల్లిపోనాడో.."
సుబ్బు  :
"ఆ పిల్లలే ఊరునిక సూసుకోవాలి .ఆయన ఉన్నంతకాలం ఊరు ఎలిగిపోయింది .. మా గొప్ప మారాజులు   "

5 డిసెం, 2012

గుద్దులాట నవ్వులాటై..


నిన్నేమైయ్యిందంటే మా ఆయనకి నాకు డిష్యుం డిష్యుం అయ్పోయిందన్నమాట.
డిష్యుం డిష్యుం ఎందుకైయ్యింది అని పక్కన పెట్టేస్తే..

బేసిగ్గా మనం క్లాసులు పీకెవాళ్ళంటే ఆమడ దూరం పారిపోతాం..
మరి మన దేవుడు గారికి జోకులు వెయ్యడం బాగ ఇష్టం కదా..
అలా పారిపోయే నన్ను జీవితాన్ని కాచి కాదు కాదు మరగబెట్టేసి మరీ వడపోసేసి తన అనుభవ సారంతో  తెగ క్లాసులు పీకేసే మా ఆయనకి ముడి పెట్టెసాడు..

నాకేమో ఎదుటివాళ్ళు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు అలంటివేమీ తెలీదు అన్నమాట..
సో అలా తింగరి మంగళం పనులు చేసేసి పాపం మా ఆయనని బాగా విసిగించేస్తా..
అలాంటి తింగరి పని ఒకటి చేసి మా ఆయనకి దొరికిపోయా

మా ఆయన క్లాస్ పీకడం మొదలెట్టేసారు..
సరే మనం ఊరుకుంటామా సగటు మొండి పెళ్ళాం లాగ వాదిస్తాం..
వాదన పెరిగి
ధూం ధాం..
డిష్యుం డిష్యుం..
దిత్తై తకతై
ఎడమొహం పెడమొహం..

అంతా అయిపోయాక..
"ఇదంతా కాదురా నేను చెప్పేది నువ్వు కరెక్ట్ గా   రిసీవ్ చేసుకోవట్లేదు ..నీ ఆలోచనా  విధానం మారాలి.."
అన్నారు మా శ్రీవారు కూల్ గా.
" ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు..నువ్వే నా బాధ అర్దం చేసుకోవట్లేదు.."
అని చెప్పి అటు తిరిగి కిటికి వైపు చూస్తున్నా..
"అదిగో మళ్ళీ..ఇప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు..నేను చెప్పేది లోచిస్తున్నావా లేదా."
"హ్మ్మ్ " నేను
"చెప్పు..ఈ క్షణం ఎగ్జాక్ట్ గా  నువ్వేం ఆలోచిస్తున్నవో చెప్పు..ఈ క్షణం ఇప్పుడు చెప్పు..  "
"నిజం చెప్పనా..?"
"చెప్పు  ప్లీజ్..ఈ క్షణం..దాన్నిబట్టి నీ అలోచనలను నేను అర్ధం చేసుకుంటాను.."
అప్పటిదాకా దీక్షగా కిటికీ కర్టెన్ వైపు చూస్తున్న నేను ఇటు తిరిగాను..
"మరీ..మరీ"
"చెప్పు "
............................
............................
............................

"మరీ..వాషింగ్ మెషీన్ లో వేస్తే కర్టెన్లు ముడతలు పడిపోతాయి కదా" అన్నాను

అంతే 
మా ఆయన రియాక్షన్ చూడాలి ..
ఒక్క క్షణం షాక్ గురి అయ్యి అలా ఉండిపోయారు..

"నిజంగా అదే అలోచిస్తున్నా" అన్నా అమాయకంగా మొహం పెట్టి.
వెంటనే ఇల్లు ఎగిరిపోయేలా గాఠ్ఠిగా నవ్వేసారు..
హమ్మయ్యా సారు నవ్వేసారు..:)
నేనూ అప్పటిదాకా ఆపుకుంటున్న నవ్వుని ఆ ఆయన నవ్వుతో జత కలిపా..
ఇంకేమిటి చూస్తున్నారు ??

గొడవ గోదాట్లోకి..
మేము ఆఫీసులకి..:)


క్లాసులు  తప్పితే మిగిలిన విషయాలలో మా ఆయన ప్లాటినమేనండోయ్..:))

ఈ సందర్భంగా ఈ ఫాట వినేయండి మరీ..







4 డిసెం, 2012

మనమోహనా..

ఇది నాకెంతో ఇష్టమైన కృష్ణగీతం..
జోధా అక్బర్ సినిమాలోనిది.
సాధారణంగా డబ్బింగ్ పాటల సాహిత్యానికి స్వేచ్ఛ ఉండకపోవడంవలన చాలా పాటలు అర్ధంలేని పదాల కూర్పులాగానే మిగిలిపోతాయి..
కానీ ఈ గీతంలో భక్తి..ఆరాధన..ప్రేమ..ఎంతో బాగా వ్యక్తపరిచారు.
రెహమానుని సంగీతానికి తోడైన సాధనా సర్గం మధురమైన ఖంఠం పాటకి పరిపూర్ణతను చేకూర్చింది.
ఈ పాట ఇక్కడ వినండి.


పల్లవి:
మనమోహనా..
మనమోహనా..
కృష్ణా మొర వినవా..
కుదురే లేదు నువులేక..
యద కోరెనే నీరాక..
వీడి రావయ్య కాశీమథురా..
నా దరి చేరగ రా కుదురే లేదు నువు లేక..

చరణం:
నవనీతాచోర బృందావనిలో విహరించేవాడా..   
రాధామనోహరా ..
కనిపించవేమయ్యా..
గారాల నందుని తనయ గోపీకృష్ణ వనమాలీ ..
నీ పదముల చేరాలీ..
నీకై తపియించానే..

చరణం:
నేనూ నీదాననులే నా జీవితమే నిదేనయ్య..
నాకంటిపాపవులే ..
నాలోని జ్యోతివిలే..
మురళిని నేనవుతాను నీ పెదవులనంటి వుంటాను..
వీడనులే ఎన్నటికీ...
నువ్వేలే నా ప్రాణం.. 

జోధా పూజించే కృష్ణుడి ప్రతిమ కూడా ఎంత బాగుంటుందో..

ఈ పాటను ఇక్కడ డవున్లోడ్ చేసుకోవచ్చు

27 నవం, 2012

అమ్మో ఇంజక్షనా..!


అవును ఇంజెక్షన్ అంటే మాదీ అదే రియాక్షన్ అంటారా..? 
అది ఇంజెక్షన్ చేయించుకొనే ముందు మీ రియాక్షన్ అయ్యిండొచ్చు గాక.. 
కానీ నా విషయంలో సీన్ రివెర్స్.
ఇది నాకు ఇంజక్షన్ చేసే ముందు మా డాక్టారు గారి రియాక్షను.
అదెలా అంటే నెను ఫ్లాష్బాక్లోకి వెళ్ళాలి మరీ..
టపా తెరిచాక వెళ్ళక ఛస్తామా అని మీరు అంటారని నాకు తెలుసు..మరి నాతో పాటూ వచ్చేయండి.   
అవి నేను మూడో తరగతి చదువుతున్న రోజులు.
అప్పుడు నాకు మూడు రోజులపాటూ తీవ్రమైన జ్వరం వచ్చింది.(నాలిగోతరగతి అయితే నాలుగు రోజులు వచ్చేదా అంటే నేను చెప్పలేను.).

ఇక లాభం లేదు అని మా ఊరికి ఉన్న ఏకైక డాక్టరు కం మా ఫామిలీ డాక్టరుని (ఊరందరికి ఒకే డాక్టరు అయితే ..మీ ఫామిలీ డాక్టరేమిటో అనకండి.అదేదో ఆయనతో ఉన్న చనువుకొద్దీ మా ఫీలింగ్ ).పిలిపించారు.పాపం ఆయన బక్కపలచ మనిషి అయితేనేం రావడంతోనే చెయ్యి చూసి ఇంతలావు ఇంజక్షన్ బుడ్డీని పగలగొట్టి అంతకంటే లావున్న సిరంజ్లోకి ఎక్కిస్తున్నాడు.
అంత పెద్ద సూది నా ఒంట్లో దిగబోతుందనే ఆలోచనతోనే నాకు చెమటలు పట్టేసాయి. 


ఇక నేను పీటీఉష రేంజ్లో    పరుగు లంకించుకున్నా..ఇంటి  చుట్టు తిరిగుతున్నా.ఆ సూది పట్టుకొని మా బక్కపలచ డాక్టరు కూడ తిరుగుతున్నారు.అయనకి ఎంతసేపటికి దొరకకపోవడంతో అమ్మ,నాన్న కూడా దిగారు రంగంలోకి.నేను ఇల్లు దాటి తోటలోకి పారిపోయి దాక్కున్నా..డాక్టారు వెళ్ళిపోవడం చూసిన తర్వత కానీ..నేను బయటకు రాలేదు.
ఆ రోజుకి అలా తప్పించుకున్నా..కానీ అలా పరుగు పెట్టడం వలనేమో నా జ్వరం ఇంకా ఎక్కువైంది.
మరుసటి రోజు నేను పొద్దున్నే వెచ్చగా ఉన్న దుప్పట్లోంచి బద్దకంగా లెగుద్దామంటే  ఎవరో నా చేతులు బలవంతంగా పట్టుకున్న ఫీలింగ్..ఎమిటా అని కళ్ళు తెరిస్తే..ఎదురుగా పట్టువదలని విక్రమార్కుడు కత్తి పట్టుకున్నట్లు సిరంజ్ పట్టుకొన్న మా బక్కపలచ డాక్టారు..:(. 


సరే ఏదోలా తప్పించుకుందాం అని లేవబోతుంతే అమ్మ నాన్న నా చేతులు ఇంకా గట్టిగా పట్టేసుకున్నారు..  
పక్కన చూస్తే చెల్లితో పాటూ అన్నయ్య,అక్క( పెదనాన్నగారి పిల్లలు)ఇంకా మావయ్య.:(.. 
విధి ఎంత బలీయమైనది .మందీమార్బలంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేసారు.ఈ పద్మవ్యూహంలోంచి  ఎలా తప్పించుకోవాలబ్బా అని నేను ఆలోచిస్తుండగానే   
అన్నయ్య,అక్క రెండు కాళ్ళూ పట్టేసుకున్నరు..మా బుడ్డిది(చెల్లి) దానికేం అర్దమైందో కానీ వాళ్ళకి తెగ సాయం చెసేస్తుంది...బహుశా నా మీద పగతీర్చుకోవడంలో ఇది ఒక భాగమైయుండొచ్చు దానికి..:( మవయ్య నా తల  పట్టుకున్నాడు.అంతే
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.....ఇల్లు ఎగిరిపోయేలా పెద్ద కేక..  
ఇంజక్షన్ అయిపోయింది .మా డాక్టారు గారు పెద్ద  ఆపరేషన్ చేసేసిన రేంజ్లో విజయ దరహాసాలను చిందించుచున్నారు. 
నేను బేర్ బేర్ మని ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను.   


ఆ రోజూనించీ మా డాక్టారు గారిమీద పగతో రగిలిపోయేదాని.. 
ఇప్పుడు మనం అయిదో  తరగతికి వచ్చేసాం అన్నమట..మాయదారి జ్వరం మళ్ళీ వచ్చింది.మళ్ళీ వచ్చారు డాక్టారుగారు..
ఎక్కించేస్తున్నాడు ఇంజక్షన్ సిరంజ్లోకి..
హన్నా ఆ రోజు నన్ను నిస్సహాయురాలిని చేసి మా వాళ్ళందరినీ ఉసిగొల్పి ఆ సూదిని నా ఒంట్లో దింపుతావా..
ఈ రోజు వాళ్ళెవరూ లేరు (నాన్న ఊరెళ్లారు..అమ్మ చెల్లి మాత్రమే ఉన్నారు)..
చెప్తా నీ సంగతి..

ఇలా నేను ఆలోచిస్తుంటే ఆయన సిరంజ్ తీసుకొని వస్తున్నడు నా దగ్గరికి ..
వచ్చేసున్నాడు..పారిపోదామంటే అమ్మ పట్టేసుకుంది.
ఏం చెయ్యాలీ..ఏం చెయ్యాలీ.. 
నాలో ఉన్న బలన్నంతా ఉపయోగించి డాక్టారుగారి చెంప మీద ఒక్కటిచ్చా.
పాపం అసలే బక్కపలచ మనిషి ఊహించని ఈ దెబ్బకి ఆయనకి దిమ్మ తిరిగి ఎగిరెళ్ళి మంచం మీద పడ్డాడు. 

అయ్యో అని అమ్మ నా చెయ్యి వదిలేసి అయన దగ్గరికి వెళ్ళింది ఇంకే మనం ఎంచక్కా జంపు.. 

తర్వాత నాన్నగారు వచ్చి జరిగింది తెలుసుకొని ఆయన ఇంటికి నన్ను తీసుకెళ్ళి సారీ చెప్పించారనుకోండి.కానీ మా డాక్టారు గారు పాపం బాగా బెదిరిపోయారు చాలా రోజులు  మా ఇంటికి వస్తే ఒట్టు. 
అప్పటినించీ నాకు ఇంజక్షన్ చెయ్యాలంటే  
"అమ్మో మీ పెద్దమ్మాయికి ఇంజక్షనా మీరు దగ్గరుండండి ప్లీజ్" అని అడుగుతారు నాన్నగారిని. 
ఇప్పటికీ టాబ్లెట్స్ ఎన్నైనా వేసుకుంటా కానీ..ఇంజక్షన్ అంటే చేసేవారిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి,హారర్ కం సస్పెన్స్ కం థ్రిల్లర్ సినిమా చూపించి  కానీ చేయించుకోను. 
గద్గది ఇస్టోరీ..












23 నవం, 2012

కధామంత్రం

కధామంత్రం.
దేనికంటారా వ్యాపారానికి..:)
అవునండీ..
ఈ మధ్య వ్యాపార ప్రకటనలన్నీ ఈ మంత్రన్నే జపిస్తున్నాయి. సెకన్ల నిడివిలోనే ఎన్నో బుల్లి బుల్లి కధలు చక్కగా మనకి చెప్పేస్తున్నారు.ఆ కధలలో నవ్వించేవి..మురిపించేవి..ఆలోచింపచేసెవి..ఎన్నో..
"మా బాం కొనండి .నొప్పులన్నీ మటుమాయం" అని చెప్తే ఇప్పుడెవరన్నా కొంటారా చెప్పండి.
ఒక అందమైన కధ అల్లాలి.అది ఎంత బాగుండాలీ అంటే,ఆ ప్రకటన వస్తే ఛానల్ మారకూడదు.అప్పుడు ఆ వస్తువు పేరు మన నాలుక మీద నాట్యమాడుతుంది.ఇదే వ్యాపార 'కధా'మంత్రం,అస్త్రం.శస్త్రం అన్నీనూ .
నాకు నచ్చే ప్రకటనలలో వోడాఫోన్ 'జూజూ' ప్రకటనలు ముందుంటాయ్. ఎంతిష్టం అంటే నాకు 'జూజూ' భాష కూడా వచ్చు తెలుసా..;)
ఇంకా చెప్పలంటే బోలెడు లిస్టు అవుతుంది.అందుకే ఈ మధ్య కాలంలో నన్ను బాగా ఆకట్టుకున్నవి ఇక్కడ ఉంచుతున్నాను.

ఇది ఐ సి ఐ సి ఐ వారి ప్రకటన

జోబులో చెయ్యి పెట్టుకొని..మిఠాయి వైపు నిరాశగా చూసే ఆ పాప ఎక్స్ప్రెషన్ గుండె పిండేసింది..:(
ఆ బుజ్జోడు కూడా ఎంత బాగుంటాడో కదా..:) 

ఇది తనిష్క్ వారిది .

ఇది కూడ ఎంత మురిపిస్తుందో .ఈ ప్రకటన వచ్చినప్పుడల్లా నేను మా శ్రీవారిని
"నువ్వెప్పుడు అలా చేస్తావ్ " అన్నట్లు చూస్తా..:P

ఇది సెంటర్ ఫ్రెష్ ప్రకటన 

ఇది ఎంత నవ్విస్తుందో ..:)

ఇది కార్తీకా షాంపూ వారిది.
                                                                        


పెద్ద జడలేని నాలాంటి జడ ప్రేమికురాలిని బాగా ఆకట్టుకుంది..:) చివరిలో.."నీ దృష్టే పడనీ.." అని ఆ అమ్మాయి అద్దంలో చూసుకొనేది భలే నచ్చేసింది..:)

వివిధ సంప్రదాయాల పెళ్ళికూతురలను అందంగా చూపించే మలబార్ గోల్డ్ ప్రకటనలు కూడా భలే ఉంటాయి.



ఇలా ఇంకెన్నెన్నోనండి.పెట్టుకుంటూపోతే టపా ఇంక అవ్వదు..:)
ఇంకా ఈ వ్యాపార ప్రకటనలలో సంగీతానికి..దానికొచ్చే ప్రాముఖ్యతకి కొదవేం లేదు.ఎయిర్టెల్ వారి.."ప్రతి ఫ్రెండూ అవసరమేరా"..ప్రకటనే దీనికి నిదర్శనం.
కొన్ని బిస్కెట్లు వంటి తిండి పదార్ధాల ప్రకటనలు అయితే గ్రాఫిక్స్తో కట్టి పడేస్తాయి.బాదం పప్పులు, జీడి అప్పులు గాల్లో ఎగిరొచ్చి చాక్లెట్ క్రీంలో పడినట్లు చూపిస్తే లొట్టలేసి అప్పటికప్పుదు కొని తినేయాలి అనిపించదా ఎవరికన్నా..:)   
ప్రకటనలు ఎంతగా ప్రజలలోకి వెళ్ళిపోతున్నాయి అంటే,"అదిరిందయ్యా చంద్రం.కొత్త ఇల్లు..కొత్త కారు.." లాంటి డైలాగులు దైనందన జీవితంలో ఇప్పటికీ వింటునే ఉన్నాం.అసలు ఇంత బుల్లి కధలను ఎంతో సృజనాత్మకంగా ప్రేక్షకుల మనసు కట్టిపడేసేలా తెరకెక్కిస్తున్న దర్శకుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండగలమా..?
అసలు ఒక్కోసారి కేవలం ప్రకటనలకోసమే టీవీ చుడాలనిపిస్తుంది అని నేను చెప్తే అతిశయోక్తి అనుకోరని నా నమ్మకం.



    

21 నవం, 2012

మన్నించు మిత్రమా..




ఉదయాన్నే బాల్కనిలోని ఉయ్యాల బల్ల మీద కూర్చొని పేపర్ తిరగేస్తున్నా.పేజీలు తిరగెస్తున్నా కానీ దృష్టి అంతా ఎదురింటి మీదే ఉంది.
"రోజూ నాకంటే ముందే నిద్ర లేచి,పేపెర్ తిరగెస్తూ నవ్వుతూ నన్ను చూసేవాడు.ఇంకా వాడూ బయటకు రాలేదెంటో.?" అనుకుంటుండగా,కాఫీ కప్పుతో శ్రీమతి  ప్రత్యక్షం అయ్యింది. 
"అలా దొంగ చూపులు చూస్తారెందుకండీ.వెళ్ళి ,తెల్లారి ఇంత సేపయ్యింది.ఇంకా కనపడలేదేమిట్రా అని అడగొచ్చు కదా" అంది.
"ఎవరు దొంగ చూపులు చూసేది.తెలియకుండా మట్లాడకు.వాడికి,నాకు ఏ సంబంధం  లేదు.నువ్వు లోపలికి వెళ్ళు" అన్నాను. 
అన్నానే కానీ నాక్కూడా వెళ్ళి అడగాలనే ఉంది.వాడిమీద ఎంత కోపం ఉన్నా వాడిని చూడకుండా నిద్ర పట్టదు నాకు.
ఈనాటి స్నేహమా మాది?ఊహ తెలిసినప్పటినించీ ఒకరికోసం ఒకరం అన్నట్లు ఉండేవాళ్ళం. మా తల్లితండ్రులు ఎదురెదులు ఇళ్ళల్లో ఉండేవాళ్ళు.వాడికీ  అన్నదమ్ములు,అక్కచెళ్ళెళ్ళు లేకపోవడం వలన ,నాకు ఉన్నది ఒకతే అక్క అవడంవలనా ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం.ఒకే స్కూ ్లో ,ఒకే కాలేజీ లో చదివాం.స్కూలు తర్వాత ప్రైవేటు కాలేజీలో చదివించడానికి వాళ్ళ నాన్న స్థోమత లేక వద్దంటే ,నేను కూడా వాడితో పాటూ గవర్నమెంట్ కాలేజీలో చేరాను.ఈ విషయంలో మా నాన్నకి నా మీద చాలా కోపం ఉండేది. వాడు నాకంటే బాగా చదివేవాడు.ఇద్దరం కలిసి గ్రూప్స్ రాసేవాళ్ళం.ఆ పోటీ పరీక్షల్లో వాడి సహయ సహకారాలు లేకపోతే నేను ఈరోజు ఇలా స్థిరపడేవాడిని కాదు.అదేమాట వాడితో ఎప్పుడన్నా అంటే  
"నువ్వు పుస్తకాలు,బట్టలు ఇచ్చి నన్ను చదివించావురా మాధవా .జన్మలో నీ ఋణం తీర్చుకోగలనా?" అనేవాడు నవ్వుతూ.
అవును ఇద్దరం ఒకరికొకరు ఋణపడ్డవాళ్ళమే. 
ఇద్దరం చాలా ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం.పెళ్ళైన రెండేళ్ళకి మాకు ప్రవీణ్ పుట్టాడు.వాడికి సంతానం  కలగలేదు.ప్రవీణ్ని ఒకరకంగా వాడే పెంచి పెద్ద చేసాడు. 
ఉద్యోగాలరీత్యా వేరు వేరు ఊర్లలో ఉన్నా మా స్నేహం కొనసాగుతూనే ఉండేది.వాడు ఎక్కువగా హైదరాబాదులోనే సర్వీస్ చేసాడు.ప్రవీణ్ కూడ ఇంజినీరింగ్ వాడి దగ్గరే చదువుకున్నాడు.
రెటైర్మెంట్ వచ్చేసరికి ముందుగా అనుకున్నట్లుగానే ఇద్దరం హైద్రాబాదులో ఎదురెదురుగా ఇళ్ళు కట్టుకున్నాం.అప్పటినించి మళ్ళీ కబుర్లు,సినిమాలు,కలిసి వాకింగ్లు,కాఫీలు మా పాత రోజుల్లోలాగ.మా ఇద్దరి భార్యలు ఈ విషయంలో చాలాసార్లు మాపై అలుక వహించారు.   
నా భార్య లక్ష్మి కలుగాలిన పిల్లిలా లోపలికి బయటకు తిరుగుతోంది. 
"అన్నయ్య ఇంకా రాలేదేంటండి.." అంటుంది..
నేను ఆవిడకి సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చేసాను.  
వాడి గురించి నేను మాట్లాడను.కారణాలు ఉన్నాయి.   
ప్రవీణ్ ఉద్యోగంలో చేరాక, వాడికి నా మేనకోడలినిచ్చి పెళ్ళి చేసి మా అక్కకిచ్చిన మాట నిలబెట్టుకుందాం అని ఒకరోజు ప్రవీణ్ని, వాడిని కూర్చోబెట్టి విషయం చెప్పాను.
"నాన్నా.మీకు ఈ ఆలోచన  ఉందని నాకెప్పుడూ చెప్పలేదే?" అన్నాడు ప్రవీణ్   
"ఎప్పుడో అక్కకి మాట ఇచ్చానురా.చదువుకొనేటప్పుడు ఇవన్నీ ఎందుకని నీకూ చెప్పలేదు.అయినా జానకికి ఏం తక్కువరా లక్షణంగా ఉంటుంది.చదువుకుంది.బయట అమ్మయినైన ఇవేగా చూసేవి ? అన్నాను. 
"క్షమించండి నాన్న.నేను భానుని ఇష్టపడుతున్నాను.నాతో పాటే చదువుకుంది.ఇప్పుడు నాతో పాటే జాబ్ చేస్తుంది.ఈ విషయం మవయ్యకి కూడా తెలుసు.భాను ఒకసారి ఇంటికి వచ్చింది కూడా.
నా నోట మాట రాలేదు.
"అంటే మీ నిర్ణయాలు తీసేసుకున్నారన్నమాట.ఏరా రామూ నువ్వు నాకు ఒక్కమాట చెప్పలేదన్నమాట."   
"అది కాదురా మాధవా..సమయం చూసి నీకు చెప్దామనుకున్నాను.నువ్వు అక్కకి మాట ఇచ్చిన సంగతి నాకు తెలీదురా.."  
"ఏదేమైనా ఇది మా అక్కకిచ్చిన మాటరా.నా కొడుకుగా నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది" అన్నాను ప్రవీణ్తో 
"క్షమించండి నాన్న.భానుని తప్ప వేరే ఎవ్వరినీ పెళ్ళి చేసుకోలేను."
"అయితే ఈ రోజు నించి నీకు నాకు ఏసంబంధం లేదు.ఆ పిల్లనే పెళ్ళి చేసుకోవాలనుకుంటే నన్ను మర్చిపో "అన్నాను .
మౌనంగా వెళ్ళిపోయాడు ప్రవీణ్.
"ఒరేయ్ .నువ్వు మాట ఇచ్చావు సరేరా.కానీ అదంతా వాడికి తెలీదు కదా.వాడు దేనికీ తొందరపడడురా.ఒకసారి ఆలోచించు" అని చెప్పి వాడు కూడా వెళ్ళిపోయాడు.
రెండు నెలల తర్వాత ప్రవీణ్ నా దగ్గరికి వచ్చాడు.  
"నాన్న.భానుకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట.దయచేసి ఒప్పుకోండి నాన్నా."
"ప్రవీణ్ నీకు నా నిర్ణయన్ని ఎప్పుడో చెప్పాను.నువ్వు ఆ అమ్మయినే పెళ్ళి చేసుకోదలిస్తె మళ్ళీ నా కంటికి కనిపించకు.
ప్రవీణ్ వెళ్ళిపోయాడు.నా భార్య, రామూ  నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు.
మూడు నెలల తర్వాత ప్రవీణ్ ఉత్తరం రసాడు.
"నాన్న.తప్పనిసరి పరిస్థితులలో భానుని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది.ఈ గురువారం పెళ్ళి. దయచేసి మీరు,అమ్మ,మవయ్య,అత్తయ్య రండి నాన్న.నన్ను ఆశీర్వదించండి.నేనే వచ్చేవాడిని కానీ మీరు రావద్దు అన్నారు.ఫోనులో నా గొంతు వినగానే కట్ చేస్తున్నారు.అందుకే ఈ ఉత్తరం.నన్ను క్షమించండి నాన్న."   

నా కొడుకు నా మాటకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఇలా పెళ్ళి చేసుకోవడన్ని ఎలా సహించను.ఉత్తరం చేతిలో ఉండగానే రాము వాళ్ళు వచ్చారు. 
"ఒరేయ్ మాధవా.మనిద్దరికీ వాడు ఒక్కడే కొడుకురా.వాడి పెళ్ళి ఇలా జరుగుతుందనుకోలేదు.మనం కనీసం చుడ్డనికైనా వెళ్దామ్రా. వాడిని అనాథను చెయ్యొద్దురా." అన్నాడు రాము.
"అవునండి .అన్నయ్య చెప్పేది నిజం.కనీసం పెళ్ళికైనా వెళ్దామండి" అంది లక్ష్మి . 
"అన్నయ్య మీ మాట కాదనడం ప్రవీణ్ తప్పే .కానీ పెళ్ళి వేళలో వాడు సంతోషంగా ఉండాలి కదా"అంది నా చెల్లెలు(వాడి భార్య). 
"నన్ను కాదని వాడి పెళ్ళికి వెళ్ళలనుకొనేవాళ్ళు ఎవరైనా నాతో ఏసంబంధం ఉండబోదని గుర్తుంచుకోండి." అని వెళ్ళిపోయాను.
గురువారం వచ్చింది.వాడూ,నా చెల్లలు పెళ్ళికి వెళ్ళారు.నా భార్య ఏడుస్తూ ఇంట్లోనే ఉంది.  
పెళ్ళికి వెళ్ళొచ్చి శుక్రవరం పొద్దున్నే రోజూలానే నాదగ్గరికి వచ్చాడు .నన్ను కాదని దగ్గరుండీ మరీ వీడు పెళ్ళి జరిపించడం నాకు చాలా కోపం తెప్పించింది.
"ఎంట్రా.ఏం చేస్తున్నవ్?
నేనేమీ మాట్లాడలేదు.
"ఒరేయ్.నీకోపం నాకు తెలుసురా.కానీ మీరు రాలేదని వాడు ఎంత బాధపడ్డడో తెలుసా.పెళ్ళి అవుతున్న సంతోషం లేదురా వాడి మొహంలో.మేము కూడ వెళ్ళకపోతే ఎమైపొయేవాడో.ఆలోచించు
"లక్ష్మీ.ఏం చేస్తున్నవ్?" పిలిచాను నా భార్యని. 
"ఒరేయ్.ఎందుకురా అంత పంతం.నాతో మాట్లాడవా.ఏం వాడు నీకు ఒక్కడికే కొడుకా?నాకు కాదా.?నాకు వాడి పెళ్ళికి వెళ్ళె హక్కు లేదా?"అన్నాడు వాడు.
"లక్ష్మీ, నేను బయటకు వెళ్ళలి.స్నానానికి నీళ్ళు పెట్టు " అని చెప్పి లోపలకి వచ్చేసా. 
అప్పటినించి నేను వాడితో మాట్లాడలేదు.ఆరు నెలలు అయ్యింది.వాడు మాత్రం రోజూ ఉదయన్నే ఇంటికి వస్తాడు.నా భార్యచేతి కాఫీ తాగుతాడు.నాతో ఎవేవో కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు."చిన్న పిల్లాడు.ఒక్కసారి ప్రవీణ్కి ఫోన్ చెయ్యరా" అని చెప్తాడు.
నేను నవ్వకపోయినా నన్ను చూసి నవ్వుతాడు.నా కోపాన్ని పట్ట్టించుకోకుండా వాడు చేసే ఈ పనులు చూస్తే  ఇంకా కోపం వస్తుంది నాకు.కానీ వాడిని చూడకుండా ..వాడి మాటలు వినకుండా నాకు నిద్ర పట్టదని నాకు మాత్రమే తెలిసిన నిజం. 

వాడు వచ్చే టైం అవుతుంది.త్వరగా స్నానం చెయ్యాలి అనుకుంటుండగా  
"ఏవండీ."అంటూ వచ్చింది లక్ష్మి. 
"ఏమిటోయ్.అంత కంగారుగా ఉన్నావే.మీ అన్నయ్య వచ్చే టైం అయ్యిందిగా .ఎదురుచూస్తున్నావా?" అనడిగాను వెటకారంగా.
"ఏవండీ..మరీ రామన్నయ్య..." అని ఆగిపోయింది  
"ఏమైంది."
"రామన్నయ్య మనకి ఇంక లేరండి."అంది ఏడుస్తూ. 
నేను విన్నది ఏమిటో నాకు అర్దం కాలేదు
"ఏమిటి లక్ష్మీ నువ్వనేది.." 
"అవునండి.రాత్రి నిద్రలోనే పోయారట.." వెక్కి వెక్కి ఏడుస్తుంది.
నాకాళ్ళ కింద భూమి కంపించింది.అలానే మ్రాంపడిపోయాను. 
"ఏవండీ వెళ్దాం రండి.." అని నా చెయ్యి పట్టుకుంది లక్ష్మి.
నాకు ఎమీ వినిపించడంలేదు.
"ఏవండీ పంతాలకు ఇది సమయం కాదండి రండి.."
ఆశ్చర్యం  నా కళ్ళోల్లో నీళ్ళు కూడా రావట్లేదు.
మౌనంగా కూర్చుండిపోయాను. 
"మీరు ఇక మారరు.అన్నయ్య చనిపోయినా ఇంకా మీకు కోపం పోలేదు అంటే మిమ్మనేమనాలో నాకు అర్ధం కావట్లేదు.మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తున్నాను.."
అని వెళ్ళిపోయింది. 
"పిచ్చిదానా.వాడిమీద నాకు కోపమా..ఏం తెలుసు నీకు..వాడు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాడు.?
ఒరెయ్ రామూ చెప్పరా ఎలా వెళ్ళిపోతావు నన్ను వదిలి.."

ఇన్నళ్ళూగా..ఇన్నేళ్ళుగా.. 
ప్రాణంలో ప్రాణంగా   
మనసులో మనసులా 
కష్టాలు ..ఇష్టాలు పంచుకున్నావు..
భాసలు చేసావు..ఊసులు చెప్పావు..
జీవిత గమనంలో ప్రతి అడుగులో తోడుగా ఉన్నావు.. 
జీవితచరమాంకంలో నన్ను ఒంటరిని చేసావా?
స్వాతిముత్యంలాంటి నీ మనసు  
మంచుపూవులాంటి నీ నవ్వు
సజీవమైన నీ స్నేహ హస్తం..
ఇక లేవా?
మాట మన స్నేహాన్ని దూరం చెయ్యలేదు అనుకున్నాను 
మనల్ని విడదీయగా మరణమొకటి ఉందని  మరిచాను..
"నాతో మట్లాడరా మాధవా..." అని నన్ను అడుగుతూనే
మాట కూడా చెప్పకుండా 
నీవు లేని 
ఈ నిశీధి వీధులలో
కన్నీటి సాగరంలో 
నన్ను వదిలి వెళ్ళిపోయావా..
నేను మట్లాడడంలేదని శాశ్వతంగా నామీద అలిగావా. 
నువ్వు ఉండే చోటుకి నేను త్వరలోనే వస్తాను.
నా నేస్తాన్ని "మన్నించమని" అడగాలి మరి.




  • గమనిక.ఇది నాకంతో ఇష్టమైన బాపూ రమణల స్నేహం స్ఫూర్తితో  అల్లిన కధ.విషాదాంతమే...:(  కానీ  ఆ అందమైన స్నేహం చిరస్మరణీయం.