??????

21 జన, 2019

స్వరరాగ గంగా ప్రవాహమే ...

ఆ ప్రవాహం యొక్క అమృత ధారలు చెవులలోనించి గుండెని తాకి..
నా హృదయాన్ని కరిగించి..కన్నీటి ధారలై ఉబికి వస్తే..
ఆ కన్నీటితో ఆ మహా మనీషి పాదాభిషేకం చేయాలని ఎంతగా తపించానో..
అలా చేసే అవకాశం ..అదృష్టం ఉండొద్దూ ..
అందుకే మీతో పంచుకొని కొంచెమైన సంతృప్తి చెందుదామని  ఇలా వచ్చానన్నమాట .
ఈ టపా శీర్షిక బట్టీ..మీరు కూడా నాలాగే సంగీత ప్రియులు అయితే ఈ పాటికే తెలిసిపోయుండాలి కదా మీకు.



అవును ఆ గాన గంధర్వుడు జేసుదాసు గారి గురించే నేను చెప్పేది.
చిన్నప్పుడు..నాన్నగారు ప్రతి శనివారం నర్సాపురం వెళ్ళి..కొత్తగా విడుదలైన సినిమా పాటల క్యాసెట్టులు..కొన్ని ఆయనకి ఇష్టమైన పాత పాటల క్యాసెట్టులు తీసుకొచ్చేవారు.నేను చెల్లి ఇక వారమంతా అవి వింటూ ,పాడుతూ..పాడుతూ.,వింటూ ..మా ప్రతిభతో అందర్నీ హింసించేవాళ్ళమనుకోండి(ఈ కబుర్లు వేరె టపాలో చెబుతానేం) .
అంత చిన్న వయసులో ఒక గొంతు మాత్రం నన్ను విపరీతంగా ఆకట్టుకొనేది .. నేను అప్పుడు విన్న పాటలు
"దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.."
"ఆకాశ దేశాన ..ఆషాడ మాసానా.."
"ముసి ముసి నవ్వులోనా.."
ఇవి వింటున్నప్పుడు ఆ గొంతులోని ఆద్రత నా చిన్ని మనసుని ఎంతగానో కదిలించేది.ఎదిగే కొద్దీ..కేబుల్ టీవీ సదుపాయం వచ్చాక అర్ఢమయ్యింది ఆయన జేసుదాసుగారని..
అలాంటి జేసుదాసుగారి గానకచ్చేరి హైదరబాదులో డిశంబరులో జరుగుతున్నదనగానే ఎంతగా ఉవ్విళ్ళూరానో వేరే చెప్పాలా..
కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడి ..నిన్న శిల్పకళా వేదికలో జరిగింది ఈ గాన కచ్చేరి.
పాపతో అన్నిగంటలు ఉండగలుగుతామో లేదో అని ఒక పక్క అనుమానంగా ఉన్నా.."నీకెందుకు ..నేను చూసుకుంటాను కదా..సదా మీ సేవలో.." అంటూ శ్రీవారు అభయహస్తం ఇవ్వటంచేత చక్కగా తయ్యారు అయిపోయి ఆరుగంటల కల్లా శిల్పకళా వేదిక చేరుకున్నాం..
కారు పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసరికి మరో అరగంట.మొత్తం హాలు నిండా జనం.మా సీట్లు వెతుక్కొని కూర్చొనేసరికి హమ్మయ్య అనిపించింది.ఒక పదినిమిషాలు ప్రకటనలు.తర్వాత వ్యాఖ్యాత గాయత్రి భార్గవి కార్యక్రమాన్ని ప్రారంభించి ,జేసుదాసుగారిని వేదిక మీదికి ఆహ్వనించారు. 
తెల్లటి లాల్చీ పైజమాతో,తెల్లటి పొడవాటి గడ్డం జుట్టుతో వేదిక మీద ప్రత్యక్షమైన  జేసుదాసుగారు
చుట్టూ ఒక అద్వితీయమైన తేజోవలయంతో ఒక దేవ ధూత లాగ,ఒక సంగీత మాహా ఋషి లాగ కనిపించారానడం ఏమాత్రం  అతిశయోక్తి  కాదండి.
అందరికీ సవినయంగా నమస్కరించి
"మహాగణపతిం.." తో కచ్చేరి ప్రారంభించారు.. ఒక ఇరవై సెకన్లకు మైకు పనిచేయలేదు.కానీ ఆయన పాడుతూనే ఉన్నారు.ఎంత స్పష్టంగా వినిపించిందో ఆయన గొంతు.
"ఈ టెక్నాలజి  లేకుండానే మా సాధన జరిగింది.అందుకే మేము దీనిని నమ్ముతాము కానీ దీని మీద ఆధార పడము. " అనగానే హాలులో చప్పట్లు .తర్వాత ,వరసగా
"ఆకశ దేశానా.."
"గాలివానలో ..."
"దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.."
ఇలా పాడుతూ ఉంటే కాసేపు సర్వం మరిచి గంధర్వ ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి..
సంగీతంతో తల పండిపొయిన ఒక ఎనభై ఏళ్ళ ఆ మహా మనిషి గొంతు మాత్రం నిత్య యవ్వనాన్ని సొంతం చేసుకున్నదేమో.?ఆయన అంతసేపు నిలబడి ఎలా పాడతారు ..ఒక కుర్చీ ఉన్నా బాగుండేది అని అనుకోకుండా ఉండలేకపోయాను.ఆ వయసులో అలా నిలబడి పాడటం సామన్యమైన విషయం కాదు కదా మరి.ఇంతలోపు ఆయన తనయుడు విజయ్ జేసుదాసుగారు ప్రేమం  సినిమాలోని 'ఎవరే .." పాటతో ,తర్వాత కల్పన రాఘవేంద్ర గారితో ఒక డ్యుయెట్టు పాట,మళ్ళీ కల్పనా గారు "ఆకశం ఏనాటిదో.."పాటతో అలరించారు.
ఇంతలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి వేదికనలంకరించబోతున్నారంటూ విజయ్ జేసుదాసుగారు ప్రకటించారు.
ఎవారా అని చుస్తూ ఉండగానే ఇంకెవరు మన బాలు గారు.


" అన్నగారి కచ్చేరి జరుగుతుంటే రాకుండా ఎలా ఉండగలుగుతాను..ఆయన నాకు అన్నగారు..గురువు..కొన్ని సార్లు నా తండ్రి కూడా.." అని బాలు చెమర్చిన కళ్ళతో ఆయనకి వేదిక మీద సాష్టాంగ నమస్కారం చేస్తే ..మన కళ్ళు చెమర్చకుండా ఎలా ఉంటాయి..
బాలు గారు వచ్చి అప్పటి దాక నా మనసులో ఉన్న రెండు కోర్కెలు ఆయన ద్వారా  ఫలింపజేసారు
ఒకటి  జేసుదాసుగారికి పాధాభివందనం చేయటం..రెండు ఆయనని సంగీత ఋషి అని కొనియాడటం. .
ఇక ఇద్దరూ కలిసి దళపతి సినిమాలోని "సింగారాల పైరుల్లోనా బంగారాలే పండేనట" పాట తమిళంలో  పాడుటుంతే..సభికుల హర్షద్వానాలు మిన్నంటాయి..
"బాలూ గారి రాక ..ఆయనతో ఈ పాట పాడటం..ఇవన్నీ భగవంతుడి కృప..మనం అనుకోనివి..దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు.." అని జేసుదాసుగారు సంతోషాన్ని వ్యక్తం చేసారు..
తర్వత బాలు గారు సెలవు తీసుకున్నారు. 
ఇంక వరసగా హింది,తెలుగు,తమిళం,మలయాళం ,కన్నడ పాటలతో తండ్రీ తనయులు,కల్పనా గారు సభికులను ఉర్రూతలూగించారు..
అన్నీ వేటికవే సాటి,ఒక్కక్క పాట గురించి ఒక్కొక్క టపా రాయొచ్చు.
విజయ్ జేసుదాసుగారు అచ్చంగా తన తండ్రి గొంతుని పుణికి పుచ్చుకొని పాడుతుంటే ,మనిషి కనపడకుండా పాడితే ఎవరిది ఎవరి గొంతో గుర్తు పట్టడం అంత సులభమైన విషయం కాదండోయ్.కల్పనా గారి ప్రతిభ కూడా ఈ కచ్చేరికి ఎంతగానో వన్నె తెచ్చింది..
నాలుగున్నర గంటల పదర్శన ..
మధ్య మధ్యలో
పాపాను  పాపం శ్రీవారు బయటకు  లోపలికీ తిప్పుతున్నారు. అన్యమన్స్కాగానైనా పోనీ వెళ్ళిపోదాం అని అడుగుతుంటే,నాకేమీ ఇబ్బంది లేదు.మొత్తం అయ్యకనే వెళ్దాం.మళ్ళీ ఈ అవకాశం రమ్మన్నా రాదు కాదా.." అన్నారు.
నిజమే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో..మళ్ళీ ఆయనను నా కళ్ళ ముందు పాడటం చూస్తానో లేదో,అని పంచేంద్రియాలని ఏకం చేసి లీనమైపోయాను.

ప్రదర్శనలో విజయ్ జేసుదాసుగారి ఛతురోత్కులు ,కల్పన గారి కబుర్లు..ఇంక జేసుదాసుగారి మాటలన్నీ ఆణీముత్యాలే..వాటిలోకొన్ని

 "దయచేసి వీడియోలు తీయకండి..మీరు ఆనందించండి.. మీ మెదడులో ..ఆత్మలో..నిక్షిప్తం చెసుకోండీ.. "

"ఒక వయసులో పాడటం ఆపేద్దమనుకున్నాను..నా గొంతు సహకరించడం లేదని..ఎప్పుడైతే నా బ్లడ్ గ్రుపునకు తగ్గట్ట్లు నా ఆహరపలవాట్లు మార్చుకున్నానో మళ్ళీ ఇలా పాడగలుగుతున్నాను..కాబట్టి మీ శరిరానికి తగ్గట్ట్లు తినండి.."

"సెల్ఫీ ఈజ్ సెల్ఫిష్నెస్ ..ఫోనులు అతిగా వాడకండి..జీవించండి."

"నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను..కర్ణాటక సంగీతం నేర్చుకొనే క్రమంలో ఎన్నో హిందూ కీర్తనలు పాడాను.ఈ సప్త స్వరాలు సప్త ఋషులు .సంగీతానికి భాషలేదు..మతం లేదు..అది ఒక్కటే..అలాగే అనేకమైన రూపాలలో ఉన్నా దేవుడు ఒక్కడే..అనవసరమైన మత విద్వేషాలను వీడనాడండి..శాంతంగా ..ఆనందంగా జీవించండి.."

అన్న సందేసాన్నిస్తూ
"హరివరాసరం..."పాటతో కచ్చేరిని ముగించారు..
ఆ పాటకు పాపకూడా ఆదమరచి నిద్రపోయింది..




మేమేమో..ఇంటికి వచ్చాక కూడా ..అదే పాట వింటూ ..
ఈ మహానుభావుడికి భగవంతుడు సంపుర్ణ ఆరోగ్యాన్నీ,ఆయుష్షుని ప్రసాదించాలని..అందర్నీ తన గానామృతంతో అలరిస్తూ ఉండాలని ప్రార్దిస్తూ..
నిదురమ్మ ఒడిలోనికి జారిపోయాం.

నన్ను ఈ అనిర్వచనీయమైన అనుభుతిని సొంతం చేసుకొనేందుకు .. 
శతధా..సహస్రదా..సర్వదా.."(ఎదో ఎమోషన్లో వాడాను.అర్దం అడగకండి నాక్కూడా తెలీదు..అసలు పదాలు కరెక్టేనా😜..)సహకరించిన శ్రీవారికీ  జై ..అదే ధన్యవాదములు తెలుపుతున్నాను  .అలాగే టిక్కెట్లు ఇప్పించిన స్నేహితురాలు సింధూగారికి కూడా ధన్యవాదములు టపా ముఖంగా ..😊😊

11 జన, 2019

నల్లమల వనవిహారం

కొండలు..వాగులు..మానులు.వాటిని అల్లుకొనే అల్లిబిల్లి సుమలతల అందాలు
ఇవన్నీ ఎందుకో నాకు అంతులేని ఆసక్తి,చిన్నప్పటి చందమామ కధల్లో బొమ్మల జ్ఞాపకాలు.


అందుకే అడవుల్లోకి వనవిహారం అనగానే ఎక్కడలేని హుషారు.
ఇంతకీ ఎక్కడికి వెళ్ళాను ఏమిటో చెప్పనేలేదు కదూ.
డిశంబరు,జనవరి సాధారణంగా విహారాలకు అనుకూలమైన కాలం. పాప పుట్టాక ఈ తిరుగుళ్ళు అన్నీ కట్టిపెట్టేశాం. కానీ, మళ్ళీ మూడు సంవత్సరాల తర్వత ఇప్పుడు పాపని తీసుకొని వెళ్ళవచ్చు అని అనిపించింది.
అందుకే వారంతంలో ఎక్కడికైనా వెళ్దామని తెగ ఆలోచిస్తుంటే ,అప్పుడెప్పుడో ఈనాడు పత్రికలో నల్లమల అడవుల విహరం గురించి చదివిన జ్ఞాపకం.
ఆ కధనం గురించి తెగ వెతికేస్తుంటే ఎక్కడా కనిపించలేదు.చివరికి నా వెతుకులాట చూసి స్నేహితురాలు కూడా ఒక చెయ్యి వేస్తే దొరికింది ఆ కధనం ఇక్కడ.

ఇక వెంటనే ఆలశ్యం చేయకుండా మాకు, చెల్లి వాళ్ళకి ఆన్లైన్లో పచ్చర్లలో పాలపిట్ట అనబడే కాటేజి బుక్ చేశేసాం.ఇక్కడ కాటేజీలు,టెంట్లు ఉన్నాయి కానీ,చలి మరీ ఎక్కువ ఉంటుందేమో అని మేము కాటేజి బుక్ చేసాం.
అనుకున్న శనివారం రానే వచ్చింది.
అందరం ఎంతో ఉత్సహంగా ఉదయం ఆరు గంటలకే హైదరాబాద్ నించి బయల్దేరాము.
గూగులమ్మ చక్కగా దారి చూపిస్తుంటే,సూర్యోదయాన్ని చూస్తూ రింగు రోడ్డు మీదుగా కారు కన్నా వేగంగా మనసు పరుగు పెడుతుంది.
ఒక గంట తర్వాత మాకు జంగిల్ కాంప్ నించి ఫోన్ వచ్చింది ,బయలుదేరారా సార్ ?దారి చెప్పమంటారా అని, ఆ మత్రం వారు చుపించే ఆసక్తి మా ఉత్సహాన్నీ ఇంకా పెంచింది. ఒక గంట తర్వత, ఫలహారం చేద్దామని ఒకచోట  ఆగాం.ఫలహారం అంతంత మాత్రమే అయినా ధరలు మరీ ఎక్కువ.ఇంక ఏదో అయ్యింది అనిపించి మళ్ళీ బయలుదేరాము.

కర్నూలు మీదుగా రోడ్డూ,చుట్టూ కొండలు దారంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది.
గూగులమ్మ ఇంకో అరగంటలో చేరుకుంటాం అని చెప్తుంది కానీ,ఎక్కడా అడవి కాదు కదా పెద్ద చెట్లు కూడా కనిపించడంలేదు.మేమంతా ఇదేమిటి ఇంకా అడవి రావటంలేదు అని నిరుత్సాహపడిపోతుంటే, ఇంకో పది నిమిషాలు ఉందనగా ఒక్కసారిగా చుట్టూ పరిసరాలు మారిపోయాయి,వంపుల ఘాట్ రోడ్డు,చుట్టూ చెట్లూ ,కార్ల చుట్టూ తిరిగుతున్న వానర సేన.




అందంగా ఉన్నానా లేదా? :)




ఇవన్నీ కళ్ళప్పగించి చూస్తుండగానే గమ్యస్థలం వచ్చేసాం.ఫోనులో సిగ్నల్స్ కూడ పూర్తిగా పోయాయి.

ఈ  గేటు దాటి లోపలకు వెళ్లగానే,చుట్టూ పరిసరాలు చూసి కారు పార్క్ చేసేవరకూ కూడా మనసు ఆగలేకపోయింది.అందరం కారు దిగి సరాసరి ఇదిగో ఈ టైర్ల ఉయ్యల దగ్గరకు వచ్చేసాం.
PC:Google


 అన్నీ మర్చిపోయి అందరం పాపతో పాటూ చిన్నపిల్లలైపోయాము .కేరింతలు నవ్వులు ఒక పది నిమిషాల తర్వత మాకు గుర్తొచ్చింది. మా టిక్కట్లు గట్రా ఆఫీసు రూములో చూపించి ముందు రూము లో లగేజీ అంతా పెట్టాలి కదా అని,ఇవన్నీ అయ్యాక ఒక అబ్బాయి(ఈ అబ్బాయి పేరు రాసీద్)కాటేజి దాక వచ్చి తాళాలు అవి ఇచ్చి వెళ్ళాడు.
ఆ కాటేజి,ఎదురుగా ఉన్న వాగు,పక్కనే ఆ చెట్లు అవన్నీ చుస్తునే నాకు ఎమీ చెయ్యలో అర్దమే కాలేదు,
ఆ వాగు దగ్గర ఆగి రంగుల పువ్వులని,వాటి చుట్టూ తిరుగుతున్నసీతాకోకచిలుకలనే చుడనా?  లేకపొతే ఆ వాగు దాటి వెళ్ళీ చుట్టూ ఉన్న చెట్లు,వాటి మీద రకరకాల పక్షుల కువకువలనే విననా?
లేకపోతే కాటేజి ముందర ఏకంతంగా ఉన్న కుర్చిలో కూర్చోని మంచి పుస్తకాన్నే చదవనా? ఇన్ని అందాలను కళ్ళతోనే చూడనా,కెమేరాలోనే బంధించనా?





Add caption







మేము దిగిన కాటేజి 





మా చిన్ని ఏకలవ్యుడు(రాలు?)😝



ఏమి చెయ్యాలో ,తెలియక అటూ,ఇటూ తెగ తిరిగేస్తుంటే ,శ్రీవారు నా పరిస్ఠితి గమనించి "ఇంకా ఇక్కడే ఇరవైనాలుగ్గంటలు ఉంటాం " అని గుర్తు చేసారు.
 అప్పటికి అందరికీ ఆకలి గుర్తొచ్చింది ,అదే అక్కడున్న రసీద్ ని అడిగితే ,భోజనం తయారు అయ్యాక కబురు తెస్తానన్నాడు.ఈ లోపు నలుగురం (కాదు ఐదుగురం పాపతో కలిపి)ఎవరి దారి వారుగా చుట్టూ పరికించడం మొదలు పెట్టాం.కెమేరాలు పట్టుకొని ఎవరికి వారే ఆ ప్రకృతి  అందాలు బందించడంలో నిమగ్నమైపొయాం .పాప ఎమో అక్కడికి వచ్చిన కుక్కపిల్లతోనూ,పనిచేసే పెద్దవారితో   వచ్చిన పిల్లలతోనూ ఆడుకుంటుంది.
ఈ లోపు భోజనం  తయ్యారు అయ్యిందన్న కబురు వచ్చింది.
బాగా అకలిగా ఉన్నామేమో,వెంటనే అందరం కేంటీన్ వైపు దారి తీశాం.
కాటేజి నించి కేంటీన్ కి వెళ్లలంటే ఇదిగో ఈ వేళ్ళాడే వంతెన మీదుగ వెళ్ళాలన్నమాట.



ఇది భలే సరదాగా ఉంది.
ఆవురావురుమంటూ కేంటేన్ కి వెళ్ళగానే ,అక్కడ ఉండే ఒకావిడ సెల్ఫ్ సర్వీసు అని చెప్పింది సరే అని అందరం పళ్ళాలు పట్టుకొని ,అక్కడ ఉంచిన భొజనం వైపుకు వెళ్ళాం,
అక్కడ పులిహోర,అన్నం,పప్పు ,బంగళాదుంపు వేపుడు,పెరుగు మాత్రమే ఉన్నాయి.విందుభోజనాన్నీ,కనిసం ఒక పదిరకాల పదార్ధాలని ఆశిస్తూ,ఆకలితో వచ్చిన మాకు, ఆ పదార్ధాలని చూసి సగం నీరసం వచ్చింది.అయినా ఆకలి కేకలు పెడుతుంటే వడ్డించుకున్నాం.
కానీ అది పులిహోర అయినా ,వేపుడు అయినా,పప్పు అయినా,ఆఖరికి పెరుగు అయినా ఇంట్లో చేసినట్లుగా ఎంతో రుచిగా ,శుచిగా ఉన్నాయి.అందరం కడుపు నిండా సంతృప్తిగా  భోజనం చేసాము.
మళ్ళీ ఆ వేళ్ళాడే వంతెన మీదుగా వచ్చాక అక్కడ కొన్ని సాహస క్రీడలు ఉన్నాయి.


దీని మీద వెల్లకిలా పడుకొని పైనున్న చెట్లనీ,పక్షులనీ చుస్తూ ఉంటే ఎంత అందమైన అనుభూతి కలిగిందో 

PC:Google

అక్కడ అందరం ఆడుకుంటుంటే,అక్కడికి వచ్చిన రసీద్ నాలుగ్గంటలకి తయరుగా ఉంటే జంగిల్ సఫారికి తీసుకువెళ్తానన్నాడు.
 అప్పటికి సమయం మూడు కావచ్చింది, ఇంక ఆ గంట అక్కడే కాలక్షేపం  చేసి నాలుగ్గంటలకల్లా సఫారీకి తయారయ్యి బయలుదేరాము.


అందరం సఫారీ బండి ఎక్కాము,కొంతదూరం ఘాట్ రోడ్డుమీదగా పోయిన తర్వాత బండి అభయారణ్యం లోనికి ప్రవేశించింది.పాప ఆనిమల్స్ కోసం ఎంతో ఉత్సాహంగా చూడసాగింది.
ఇది ఆకు రాలే కాలమేమో చెట్లన్నీ నారింజ ,గులబి,పసుపు పచ్చ ఆకులతో ,అవే రంగులలో కింద రాలిపడిన ఆకులతో అడవంతా ఒక వర్ణచిత్రంలా ఉంది.




కొంత దూరం లోపలికి పోయాక డ్రైవరు 'దొంగల బావి.' అనబడే దిగుడు బావి(ఒకరకం అది ఊబి) దగ్గర ఆపారు.

పూర్వ కాలంలో దొంగలు దొంగిలించిన వాటిని ఆ బావి దగ్గర దాచడం వలన దానికి ఆ పేరు వచ్చిందని ఆయన దాని గురించి వివరించారు,అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే అందరం దాని ఊడల సాయంతో ఊగే ప్రయత్నం చేసాం కానీ ,చూడ్డానికి అలవోకగా కనిపించే ఈ పని మనలంటివారికి చాల కష్టమని అర్దమయ్యింది. అక్కడ కొన్నీ ఫోటోలు తేసుకొని మళ్ళీ బండి ఎక్కాము.





కొంత దూరం లోపలికి వెళ్ళాక ఒక అందమైన నెమలి కనిపించింది.నేను నెమలి బయట చాలా సార్లు చుశాను కానీ  ఆ అడవిలో ,అది అంత నిర్భయంగా ,రాజసంగా తిరుగుతుంటే ఎంతో అందంగా కనిపించింది.
ఇంకొంచెం దూరం లోపలికి పోగానే కొండకోళ్ళు ,అడవి ఉడుతలు కనిపించాయి.


బండి లోపలికి పోతూ ఉంటే చుట్టూ ఉన్న పరిసరాలు చిత్రంగా మారిపోతున్నాయి.
దట్టమైన గొధుమరంగు గడ్డి పొదల గుండా కాసేపు,
వెదురు పొదల గుండా కాసేపు
ఒకప్పుడు ఈ దారిలో ఒక రైల్వే  లైను ఉండేదంట,ఇప్పుడు ఆ  దారిలోనే  సఫారి బండి పోతున్నది(బాలకృష్ణ ,విజయశాంతి మధ్య చిత్రీకరించిన రౌడీఇన్స్పెక్టర్ చిత్రంలోని టక్కుటమరం బండి పాట ఇక్కడే చిత్రీకరించారంట)
ఈ దారిల గుండా తీసుకుపోయి బండి ఒక వ్యూ పాయింట్ దగ్గర  ఆపారు.
ఆ వ్యూ పాయింట్ ఒక మంచెలాగ ఉంది.దాని మీద నించి చూస్తే చుట్టూ కొండలు ,మధ్యలో చిన్న సరస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంది.అక్కడికి జంతువులు నీళ్ళు తాగడానికి వస్తాయంట,మేము కొంతసేపు  ఎదురు చుశాము కానీ మాకు ఎమీ కనిపించలేదు.


తర్వాత బండి దట్టమైన అరణ్యం లోనికి ప్రవేశించింది .చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు,నిశబ్దాన్ని చీల్చుకుంటు వెళ్తున్న సఫారీ బండి చప్పుడు,ఒక్కసారికి కిందకి పైకి పోతున్న దారీ,అప్పుడే ముసురుకుంటున్న చీకట్లు .



ఎంతలేదన్నా అందరికీ ఏమో కానీ,నాకు మాత్రం ఇప్పుడు బండి  ఆగిపొతే ఎలారా దేవుడా అని మనసులో ఏములో దాక్కున్న భయం ,అలా అందరం ఒక్కసారిగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉండిపోయాం.
అలా ఒక అరగంట ప్రయాణం తర్వాత మళ్ళీ అడవి  పలచబడింది ,బండి మళ్ళీ ఘాట్ రోడ్ మీదుగా కాటేజి దగ్గరకు వచ్చి ఆగింది.

హమ్మయ్య !












ఇప్పటికి ఈ టపా ముగించాలి మరి !
చాలా కాలం తర్వాత రాయటం వలనో ఏమో,పదాల కోసం కొంచెం తడుముకోవల్సి వస్తుంది.
ఇంకా బోలెడన్ని విశేషాలు ఉన్నాయండోయ్! అవన్నీ వచ్చే టపాలో రాస్తానేం ..



PC:
* 3lok అంటే మా మరిదిగారన్నమాట. శ్రీవారిలాగనే ఈయన కూడా మంచి ఫోటోగ్రాఫర్.ఈయన చిత్రకారుడు కూడానూ.
ఈయనగారి పైంటింగ్స్ ఫోటోల్లాగా,ఫోటోలేమో పైంటింగ్స్ లాగా ఉంటాయి మరి అది ఎమీ చిత్రమో.. 😃
ఫోటోలు ఇక్కడ వాడుకోవటానికి ఈయన ఒక షరతు పెట్టారు.ఈ టపా చదివిన వారందరూ ఆయన ఇన్స్టాగ్రాం ని కూడా ఒకసారి దర్శించాలంట .ఇదిగోండి ఇక్కడ😆


*రెండు ఫోటోలు నా దగ్గర లేకపోవటంవలన ,గూగులమ్మ సహాయం కవల్సి వచ్చింది.



2 జన, 2019

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..


అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

అందరూ బాగున్నారా?
ఏమిటో ఇన్నాళ్ళ తర్వాత నా బ్లాగు నాకే కొత్తగా ఉంది.అసలు ఇవన్నీ రాసినది నేనేనా అన్న అనుమానం కూడా కలుగుతుందండోయ్ ..

నాకు ఒక బుజ్జాయి   పుట్టబోతున్నదని తెలిసి అన్నీ మర్చిపోయాను.అందులో బాగంగా బ్లాగు కూడా మర్చిపోయాను.
ఇప్పుడు నా బంగరుతల్లి బడికి కూడా వెళ్ళిపోతుంది.ఎన్నెన్నో మాటలు..ఎన్నెన్నో అల్లరి పనులు. 
మీతో పంచుకోవల్సిన విషయాలలో ఇవి కూడా చేర్చాలని అమ్మగా ఆరటం.


ఈ ముక్కలు రాస్తుంటే కూడా కొత్తగా అక్షరాలు నేర్చుకొని రాస్తున్నట్లు  ఉంది.
కానీ ఎలా అయినా రాయాలి ఎందుకంటే న్యూ ఇయర్ రిసల్యుషన్ ఎమీటంటే "Being Myself" అన్నమాట.
చెప్పాలంటే నేను  న్యూ ఇయర్ రిసల్యుషన్ పెద్దగా నమ్మను కాని ,ఒక పనిని మొదలుపెట్టడనికి  ఒక రోజైతే కావాలి కదా అందుకే ఇలా మీ ముదుకు వస్తున్నానన్నమాట.
అందరికీ ఈ కొత్త సంవత్సరంలో ప్రశాంతత దొరకాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎన్నున్నా జీవితంలో అదే ముఖ్యం కదా.ఏమంటారు?
వేదంతంతో భయపెడుతున్నానా..


పోన్లేండి.ఇవన్నీ వదిలేసీ ఇంచక్కా కబుర్లు చెప్పుకుందాంలెండి. తప్పులుంటే మన్నిచేయండి మరీ.. చాలాకాలం తర్వాత కదా !


25 ఆగ, 2016

జయ జనార్ధన కృష్ణ రాధిక పతే............


                                         
చివరిగా మా ఇంటి చిన్ని కృష్ణుడు..:)
మా బుల్లి రాధమ్మ.. :)
ఇద్దరూ ఒక్కరే సుమా..:)...




1 సెప్టెం, 2014

ఇక ఎప్పటికీ తీరని కోరిక

బాపు రమణ
ఈ ద్వయమంటే చెప్పలేని భక్తి నాకు చిన్నప్పటినించీ..
ఆ గీతలు ఆ రాతలు రోజుకీ ఒక్కసారైన గుర్తురాక మానవు. 
తెలుగుని వెలిగించడానికి వీళ్ళున్నారనే ధీమా..   
వారు గోదావరి వారు అయినందు వల్ల అందరికీ "మా బాపు మా రమణ" అని చెప్పుకోవడంలో ఒక రకమైన గర్వం.
వాళ్ళను చూడలని నాకు చెల్లికి చిరకాల వాంఛ..ఎవరైనా చూసొచ్చారంటే అసూయానూ..       
నా పెళ్ళి శుభలేఖ రాయించుకోవలని అనుకున్నా కుదరలేదు..
చెల్లిది రాయిద్దామంటే...రమణ లేని బాపుని ఎలా చూస్తాం అని అంది చెల్లి..   
ఇక ఎప్పటికీ తీరని కోరికగానే అది ఉండిపోయింది.. 
నా కోరిక తీరలేదు గానీ
బాపు రమణ ఒక్కటయ్యరు అని ఒక ఓదార్పు.
ఇంతకుమించి మాటలు రావట్లేదు..